ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అత్యంత ముఖ్యం అని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వాహనదారులకు పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలో మూడు స్తంభాల సెంటర్ కు సమీపంలోని జాతీయ రహదారులు 65, 216 కూడలి వద్ద మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్లు పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని, హెల్మెట్ తలకు రక్షణ కవచమని, ఇది ప్రమాద సమయంలో తలకు, మెదడుకు తీవ్రమైన గాయాలు కాకుండా కాపాడుతుందన్నారు. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ తోలవద్దని హితవు పలికారు. కలెక్టర్ తో పాటు ట్రాఫిక్ సిఐ నున్న రాజు, ఎస్సై ఏ రామశాస్త్రులు, తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు.