మొవ్వ:
పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు.
శనివారం జిల్లా కలెక్టర్, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ పెందుర్తి రామ్మోహన్ రావు, పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార రాజాతో కలిసి మొవ్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన భోజనశాలను ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించే విజయాలలో భోజనశాల పరోక్షకంగా కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, పాఠశాలలో భుజించేందుకు సరైన భోజనశాల ఉన్నప్పుడు విద్యార్థులు సౌకర్యవంతంగా భుజించి ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా విద్యార్థులు మంచి పోషకాహారం తీసుకుని చదువుపై బాగా దృష్టి పెట్టగలుగుతారన్నారు.
మొవ్వ జెడ్పి పాఠశాలలో ఆ విధమైన భోజనశాలను ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరించిన తాతినేని గోపాలరావు, బీనా, తాతినేని అక్కయ్య చౌదరి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
వారిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలలో చదివి ఉన్నతంగా స్థిరపడిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి పాఠశాల, అదేవిధంగా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. జిల్లాలోని మండల కేంద్రాల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించేందుకు రూపకల్పన చేస్తున్నామని, ఆసక్తి గల దాతలు ముందుకు వచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యు వి సుబ్బారావు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.