ప్రజా సమస్యల పరిష్కార వేదిక—మీకోసం అర్జీలు 75
SSN
- January 19, 2026
- 1 min read
[addtoany]
మచిలీపట్నం:
సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, డి ఆర్ ఓ చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, పి టి సి డిఎస్పి శ్రీనివాసరావులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక—మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
కలెక్టరేట్లో మొత్తం 75 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించింది..
అందులో కొన్నింటి వివరాలు ఇలా ఉన్నాయి:
గుడివాడ మండలం పర్నాసి గ్రామ కాపురస్తులు పల్లపోతు ఏడుకొండలు మాట్లాడుతూ తన ఇల్లు పర్నాస గ్రామంలో ఆర్ అండ్ బి రహదారి నుండి ఎదురుగా ఉన్న చెరువు వద్దకు రెండు బజారుల మధ్య కలదని, తన ఇంటికి రెండు పక్కల వైసీపీ పార్టీ వారు ఉంటారని, తన ఇంటికి బజారు గుండా వెళ్ళవద్దని బైకులకు రోడ్లమీద గండి కొట్టి ఆటో కూడా రానివ్వకుండా బజారులో నడపడానికి వీలు లేదని గొడవ చేస్తున్నారన్నారు. కలెక్టర్కు, ఎంపిడిఓ కు ఎన్నిసార్లు అర్జీలు పెట్టిన గ్రామ సర్పంచ్ వైసీపీ పార్టీ వారు అయినందున సచివాలయం సిబ్బంది కేసు పెట్టిన పోలీస్ వారిని రానివ్వడం లేదని బజారు ద్వారా వెళ్ళు హక్కును కల్పించి అడ్డు తగులుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ అందజేశారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన బోని అమిన్ పైక్ అర్జీ అందజేస్తూ రాము ఇప్పుడు కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేటలో నివసిస్తున్నామని, 2023 సంవత్సరంలో మొవ్వ పంచాయతీ పరిధిలోని జయలక్ష్మి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తనతో పాటు 30 మంది కార్మికులు రొయ్యల విభాగంలో పనిచేసామని, తమకు కూలీలకు సంబంధించిన 80 వేల రూపాయల బకాయిలను చెల్లించకుండా అక్రమంగా నిలిపివేశారని, ఆ కూలి డబ్బు అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆ బకాయిలు చెల్లించే ఏర్పాటు చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు.
ఉంగుటూరు మండలం పెద్దఔటుపల్లి గ్రామానికి చెందిన మండవల్లి శ్రీవల్లి తాను గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 1990 సంవత్సరంలో సెప్టెంబర్ 15వ తేదీన 1982/1990 దస్తావేజు నంబర్లో స్థలం కొనుగోలు చేశామని తనకు సంపూర్ణ హక్కు ఉన్నదని తన ఆస్తికి తూర్పు వైపున ఆగ్నేయ మూలన జంగం రామారావు అనే వ్యక్తి స్నానపు గది అక్రమంగా నిర్మించి తన రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని, తాను అక్కడ నూతన నిర్మాణం చేపట్టుటకు ఇబ్బంది కలుగుతుందని అక్రమ నిర్మాణాన్ని తొలగించి తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందచేశారు.

