కృష్ణాజిల్లా క్రీడా సంస్థ నిర్వహిస్తున్న సార్థక్ కృష్ణ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పురుషులు, మహిళల కోసం జిల్లాస్థాయి మాస్టర్స్ లీగ్ అథ్లెటిక్స్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది. ఈ పోటీలలో 35+, 45+ వయస్సు వర్గాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1500 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, షాట్పుట్ వంటి ట్రాక్ మరియు ఫీల్డ్ ఈవెంట్లు నిర్వహించగా, 60 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ జిల్లా స్థాయి పోటీలలో ఎంపికైన క్రీడాకారులు మార్చి 30, 31 తేదీలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించబడనున్న రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్), వి. వెంకటేశ్వర నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్.ఐ. రవి కిరణ్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీమతి ఎం. అరుణ, జిల్లా క్రీడా సంస్థ కోచ్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ మాస్టర్స్ క్రీడాకారుల ప్రదర్శనను అభినందిస్తూ, తాను కూడా పదవీ విరమణ అనంతరం ఈ తరహా క్రీడల్లో పాల్గొనాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఆనందం మరియు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ టోర్నమెంట్ అన్ని వయస్సుల వారిలో క్రీడలపై ఆసక్తి పెంపొందించడంతో పాటు జీవితాంతం ఆరోగ్యవంతమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిలిచినట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి కె. ఝాన్సీ లక్ష్మితెలిపారు.