ఆర్భాటాలు, హంగులకు దూరంగా ఒంటరితనంతో జీవితం గడుపుతున్న వృద్ధుల మధ్య జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు దంపతులు మచిలీపట్నం నందు గల స్నేహాలయ వృద్ధాశ్రమం నందు తమ పెళ్లి రోజు వేడుక జరుపుకున్నారు.
వృద్ధాశ్రమంలో నివసిస్తున్న నిరాశ్రయ వృద్ధులకు కావలసిన నిత్యావసర వస్తువులు, ఇతర సౌకర్యాలు సమకూర్చడంతో పాటు మిఠాయిలు, పండ్లు అందజేశారు. అంతేకాకుండా వారి చేతులు పట్టుకుని, వారి కష్టసుఖాలు వింటూ, కుటుంబ సభ్యుల్లా వారితో సమయం గడిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ దంపతులు మాట్లాడుతూ… “హంగులు, ఆర్భాటాల మధ్య వేడుకల కంటే… మన కోసం ఎదురు చూస్తున్న ఈ వృద్ధుల ముఖాల్లో చిరునవ్వులు చూడటం మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. వారి ఆశీర్వాదాలే మా వివాహ దినోత్సవానికి నిజమైన కానుక,” అని భావోద్వేగంగా తెలిపారు.
వృద్ధుల కళ్లల్లో కనిపించిన ఆనందం, తడిసిన కన్నీళ్లు, చిరునవ్వులతో మెరిసిన ముఖాలు… ఈ వివాహ దినోత్సవాన్ని ఒక వేడుకగా కాకుండా, ఒక మానవీయ సందేశంగా మార్చాయని తెలిపారు.