మచిలీపట్నం :
మే 1 వ తేదీ నుండి ఇండ్ల జాబితా, గణన కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సెన్సస్ చార్జ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కృష్ణ విశ్వవిద్యాలయంలో మొదటి దశ ఇండ్ల జాబితా, ఇండ్ల గణన జిల్లా చార్జ్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాలో ఇండ్ల జాబితా, ఇండ్ల గణన కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా మొదటి దశలో మే ఒకటవ తేదీ నుండి ఇండ్ల జాబితాను సేకరించి బ్లాకులుగా విభజించాలన్నారు.
రెండవ దశలో ఆ ఇంటిలో ఉన్న వారి వివరాలను సాధారణంగా కాకుండా చాలా జాగ్రత్తగా కనీస సమాచారంతో సహా వాస్తవాలను ప్రతిబింబించే విధంగా ఎలాంటి తప్పులు దొరలకుండా నమోదు చేయాలన్నారు. వివరాలు నమోదు చేయడం వలన ఏదైనా ప్రయోజనం పోతున్నదనే భావన అవసరం లేదన్నారు
ఈ గణన ద్వారా ఇచ్చే డేటా వివరాలు వలన ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఎలాంటి నష్టం రాకూడదన్నారు.
ఏ ఒక్క నిర్మాణం తప్పిపోకూడదన్నారు. సరిహద్దులు నిర్ణయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే
గణన సులభం అవుతుందన్నారు. ఏ ఒక్క ఇంటిలోనూ రెండు పరిపాలన యూనిట్లు అంటే మునిసిపాలిటీ గాని, పంచాయతీ గాని రెండు ఉండకూడదనీ స్పష్టం చేశారు. బడ్జెట్ మేరకు ఎన్యూమరేటర్లు నియమించుకుని అందరికీ సమానంగా పని అప్పగించాలన్నారు.
ఈ సందర్భంగా సెన్సెస్ డైరెక్టర్ ప్రసన్నకుమార్ వారి బృందం శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ శిక్షణ తరగతుల్లో విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ రాంజీ, డిఆర్ఓ చంద్రశేఖర రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఉష, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, మచిలీపట్నం, గుడివాడ ఆర్డిఓలు సాంబశివరావు, బాలసుబ్రమణ్యం, జడ్పీసీఈఓ కన్నమ నాయుడు, డిపిఓ అరుణ, సెన్సస్ చార్జ్ అధికారులైన పలువురు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దారులు తదితర అధికారులు పాల్గొన్నారు.