మాజేరులో మినుములు, పెసల కొనుగోలు కేంద్రం ప్రారంభం
చల్లపల్లి:
కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం చల్లపల్లి మండలం కొత్తమాజేరులోని రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో మార్క్ ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ ఫెడ్ డీఎం విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ ప్రభుత్వం మార్కెట్లో మినుములు, పెసల ధరల నియంత్రణకు కనీస మద్దతు ధర ప్రకటించి, కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలిపారు. పెసలు క్వింటాలుకు రూ.8,768లు, మినుములు క్వింటాలుకు రూ.7,800లు ధర చెల్లిస్తుందని వివరించారు. ఈ సీజనులో ఇప్పటివరకు చల్లపల్లి మండలంలో రూ.45కోట్లకు పైగా ధాన్యం సొమ్ము రైతు ఖాతాలకు జమ చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వ పెట్టుబడి సహాయం అన్నదాత సుఖీభవ ద్వారా మండలంలో 4,876 మంది రైతులకు రూ.2.43కోట్లు, పీఎం కిసాన్ ద్వారా రూ.96లక్షలు అందించినట్లు తెలిపారు. డ్రోన్ల కొనుగోలుకు ప్రభుత్వం మూడు సంఘాలకు రూ.29.40 లక్షలు సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. ఇవే కాకుండా సబ్సిడీపై మినుము విత్తనాలు, కలుపు మందులు, వేప నూనె, పురుగు మందులు అందించినట్లు తెలిపారు.
మార్క్ ఫెడ్ డీఎం మురళీ కిషోర్ మాట్లాడుతూ మాజేరులో 300 ఎకరాల్లో పెసలు సాగు చేసిన నేపథ్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినుములు, పెసల కొనుగోలు, సొమ్ము చెల్లింపుల గురించి రైతులకు వివరించారు.
మండల వ్యవసాయ శాఖ అధికారి కే.మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ తోట కనకదుర్గ, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, చల్లపల్లి సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, పీఏసీఎస్ చైర్మన్ తిరుమలశెట్టి బాల నాగేశ్వరరావు, సీఈఓ ఎస్.ఎస్.చక్రపాణి, గ్రామ ప్రముఖులు కళ్లేపల్లి లక్ష్మీనారాయణ, నారాయణ సేవా సమితి నిర్వాహకులు శ్రీకాంత్, గోపాలమిత్ర ఎఫ్.పీ.సీ చైర్మన్ మాలెంపాటి రంగారావు, లంకమ్మ దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు బండి నాగార్జున, నాయకులు యడ్లపల్లి బుజ్జి, బొర్రా అగ్గిరాముడు, కమ్మిలి పెదబాబు, పంచాయతీ కార్యదర్శి, వీఆర్ఓ, ఆయా శాఖల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.