మచిలీపట్నం :
అవినీతికి నిలయంగా మారిన కృష్ణా జిల్లా రవాణా శాఖపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన గుంటూరు ఏసీబీ పరిశీలకులు అంబటి మన్మధరావు బృందం, మచిలీపట్నం మోటారు వాహనాల తనిఖీ అధికారి ( ఎం వి ఐ) పి. లోకనాథ ప్రసాద్ అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై మంగళవారం ఉదయం నుండే విజయవాడలోని ఆయన నివాసం, బందరులోని కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించి కలకలం సృష్టించారు.
చాలా కాలంగా మచిలీపట్నం రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. ముఖ్యంగా లైసెన్సుల జారీ, వాహనాల ఫిట్నెస్, ఆకస్మిక తనిఖీల పేరుతో వాహనదారుల నుండి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టీవో శ్రీనివాసు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ నాయక్, సోనీ ప్రియా, నారాయణస్వామిల పనితీరుపై కూడా ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రధానంగా లోకనాథ ప్రసాద్పై వచ్చిన పక్కా ఫిర్యాదులతో అధికారులు గురిపెట్టారు.
విజయవాడలో నివాసం.. బందరులో వసూళ్లు!
విజయవాడలో నివాసం ఉంటూ ప్రతిరోజూ బందరు డ్యూటీకి వచ్చే లోకనాథ్, తన ఉద్యోగంను అడ్డం పెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఏసీబీ ప్రాథమిక విచారణ లో తేలింది. ఆయన సంపాదనకు, ఆస్తులకు పొంతన లేకపోవడంతో నివాసంలో కార్యాలయంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో మిగిలిన సిబ్బంది హడలెత్తిపోయారు.
రికార్డుల జల్లెడ లైసెన్సుల జారీలో జరిగిన అవకతవకలు, ఏజెంట్ల ప్రమేయంపై అధికారులు ఆరా తీశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి అక్రమాలకు పాల్పడే ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారి అంబటి మన్మధరావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణాజిల్లా డి టి వో ఆఫీస్ లో పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోక్ నాథ్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని ఆరోపణలు రావడంతో లోక్నాథం పై కేసు నమోదు చేసి ఏకకాలంగా విజయవాడలో నివాసం ఉంటున్న ఇంట్లోనూ వాళ్ల బంధువుల నివాసంలోనూ ఆఫీసులో తనిఖీ చేయడం జరిగిందన్నారు.