మచిలీపట్నం :
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సూచనల మేరకు మహిళా సాధికారత కార్యక్రమాలను ప్రోత్సహించే ఉద్దేశంతో కృష్ణా విశ్వవిద్యాలయం మహిళా సాధికారత సమన్వయకర్త డా. ఎల్. సుశీల ఆధ్వర్యంలో వాకథాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. విద్యాసంస్థల్లో మహిళా సాధికారత కార్యక్రమాలను బలోపేతం చేయడానికి విద్యార్థులు మరియు అధ్యాపకులను అంబాసిడర్లుగా నామినేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలకు సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి కృష్ణా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కూన రామజీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు సందేశం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహిళల సాధికారతకు అవగాహన అత్యంత అవసరమని, యువత ముందుండి సమానత్వం, గౌరవం కలిగిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమవు తుందని పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయం రెక్టర్ ప్రొఫెసర్ ఎం.వి.బి. రావు మాట్లాడుతూ వాకథాన్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యతో పాటు సమాజానికి సేవ చేసే భావన ప్రతి విద్యార్థిలో పెంపొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. నవీన లావణ్య లత మహిళా సాధికారత, సమాన హక్కులు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల పురోగతికి యువత చురుకైన పాత్ర పోషించాలని ఆమె పేర్కొన్నారు.
మహిళా సాధికారత సమన్వయకర్త డా. ఎల్. సుశీల మాట్లాడుతూ మహిళల హక్కులు, సమాన అవకాశాలు, సురక్షిత సమాజ నిర్మాణంపై అవగాహన పెంపొందించడమే ఈ వాకథాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు ప్రొఫెసర్ మారుతి, శ్రీమతి అమల, డా. మాధురి, డా. రంగశ్రీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మహిళా సాధికారతపై నినాదాలతో వాకథాన్ నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.