మచిలీపట్నం, 9 మార్చి 2026, SSN:
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ నగర్లోని హైని గర్ల్స్ హాస్టల్లో మహిళా దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన చలమలశెట్టి సునంద, తోట విజయ కుమారి లను ఘనంగా సత్కరించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో జరిగిన 45వ జాతీయ అథ్లెటిక్ పోటీలలో మూడవ స్థానం సాధించి అంతర్జాతీయ అథ్లెటిక్ పోటీలకు అర్హత పొందిన సునంద ని అభినందించారు. అలాగే 70 సంవత్సరాల వయసులో కూడా అథ్లెటిక్స్లో ప్రతిభ కనబరిచి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న తోట విజయ కుమారి ని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మాతృమూర్తి సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మల్లికార్జునుడు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల సాధికారత, క్రమశిక్షణ లక్ష్యసాధనపై ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
సన్మాన గ్రహీతలు హాస్టల్ బాలికలతో తమ అనుభవాలను పంచుకున్నారు. కృషి, సమయపాలన ఉంటే విజయాన్ని సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ అధ్యక్షుడు వేణు కుమార్, గౌరవ అధ్యక్షులు వరప్రసాద్, ఉపాధ్యక్షులు రిలాక్స్ ప్రసాద్, అనిల్, రామకృష్ణ, సుధీంద్ర కుమార్, మాణిక్యాలరావు, అలాగే సభ్యులు పావని, దీప్తి తదితరులు పాల్గొన్నారు.