మచిలీపట్నం :
తెలుగు వారి సంప్రదాయ కళలను కళాకారులనూ కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అన్నారు. స్థానిక ప్రధాన పార్కు ఓపెన్ ఆడిటోరియంలో దుర్గా కళామండలి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం
కళా వైభవాలు కార్యక్రమం జరిగింది. ప్రముఖ రంగ స్థల నటి మల్లేశ్వరి జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కళలను కాపాడుకున్నప్పుడే సమాజం కళకళలాడుతుందనీ వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు మాట్లాడుతూ సమాజ చైతన్యంలో కళలు ప్రధాన పాత్ర వహిస్తాయని అన్నారు.ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు మాట్లాడుతూ మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేవి కళలే అన్నారు. ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ దుర్గా కళామండలి అధ్యక్షుడు గాంధీ పెద్ద వయసు వచ్చి ఓపిక లేకపోయినా కళారంగ కార్యక్రమాలు నిర్వహించటం అంటే కళపట్ల ఆయనకున్న అంకిత భావాన్ని నిరూపిస్తోందని అభినందించారు. భావ తరంగిణి అధ్యక్షులు భవిష్య అధ్యక్షతన జరిగిన సభలో రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల సూరిబాబు, కళా మండలి అధ్యక్షులు గాంధీ పాల్గొన్నారు.
సభానంతరం నాట్యచార్య ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నాట్యాంశాలు ఆకట్టుకున్నాయి. తదుపరి మడమల రాంబాబు హరికథ గానం జరిగింది.