చోడవరంలో 782మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగాయలంక:
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాన్ని కూటమి ప్రభుత్వం సరిచేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం నాగాయలంక మండలం చోడవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద చోడవరం రెవిన్యూ విలేజ్ పరిధిలోని 782మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా రైతుల భూ హక్కు పత్రాలపై నాటి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన ఫోటో వేసుకొని రైతుల్లో అభద్రతాభావం నెలకొల్పారన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతుకు వారి పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రభుత్వ రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. దీనికి తోడు ఈసారి పాస్ బుక్ జారీ చేసే ముందే, రైతులు వివరాలు సరి చూసుకునే అవకాశం కల్పించి, తప్పులు ఉంటే సరి చూసుకున్న తర్వాతే పాస్ బుక్ ముద్రణ చేయించుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు.
తద్వారా కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాత ప్రభుత్వంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, తహసీల్దార్ సిహెచ్.వీరాంజనేయ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్, డీటీ కేశవి, రెవెన్యూ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.