[addtoany]
మచిలీపట్నం:
భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని, పరమత సహనం పాటిస్తూ వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
గురువారం ఉదయం నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో జిల్లా యంత్రాంగం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డిఆర్ఓ చంద్రశేఖర రావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వ మతాలను గౌరవించడం సనాతన ధర్మం, భారతీయ సంప్రదాయం అన్నారు. మన రాష్ట్రం లౌకిక రాష్ట్రమని పరమత సహనం పాటిస్తూ అందరి సాంప్రదాయాలను గౌరవించు కుంటున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో ఏమి జరిగిందో అందరికీ తెలుసన్నారు. ధర్మాన్ని కాపాడుకునే దిశలో ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలన్నారు.
వచ్చే 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం పనులు కూడా పూర్తవుతాయన్నారు. బందరు ఓడరేవు నిర్మాణం కూడా ప్రారంభించుకునే అవకాశం ఉందన్నారు.
తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. వచ్చే ఉగాది పండుగ నాటికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుందామన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలన్నారు.
జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదటి రోజని, మనం గతంలో
ఏమి నేర్చుకున్నాము అందులో మంచిని తీసుకుని భవిష్యత్తులో కూడా మంచిగా మనందరం ఎదుగుతూ మన చుట్టూ సమాజంలో ప్రతి ఒక్కరినీ కూడా ఎదగడానికి తోడ్పాటు అందించాలన్నారు. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికని అదే విధంగా జీవితంలో కూడా ఆ రెండు ఉంటాయనీ, ఆ రెండింటిని మనం సమానంగా అంగీకరించాలని మంచి జరిగితే అహంకారానికి లోను కాకుండా విపత్తులు వస్తే కుంగిపోకుండా ముందుకు సాగాలన్నారు.
అన్ని చెడు కార్యాలు పరాభవం చెందాలని మంచి అంత విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మనం ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం లో రాష్ట్రము, దేశం భవిష్యత్తు ఎలా ఉంటుందో వివరిస్తారన్నారు. రాష్ట్రం ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు త్వరగా నిర్మాణం పూర్తి కావాలన్నారు. తద్వారా ప్రజలకు రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తొలుత విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది అంటే అందులో పరాభవం అంటే అందరూ అనుకున్నట్లుగా అవమానం కాదని హర అంటే ఆదిపరాశక్తి దివ్య శక్తి అమ్మవారు పేరనీ, భవ అంటే శివుని పేరనీ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ సంవత్సరం రాజుగా గురువు బృహస్పతి ఉండటంతో అంతా మంచి జరుగుతుందన్నారు. మంత్రిగా కుజుడు, సైన్యాధిపతిగా చంద్రుడు, ధాన్యాధిపతిగా బుధుడు రస ఆధ్యాధిపతిగా సూర్యుడు, సస్య నీరసాధిపతిగా శుక్రుడు ఉన్నారన్నారు. ఈ సంవత్సరం 9 నవగ్రహాలలో ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయన్నారు. దేశంలో అందరూ సుఖశాంతులతో ఉండే అవకాశం ఉందన్నారు. అందరూ అగ్నిదేవుని ఉపాసన చేస్తే సంతోషంగా ఉంటారన్నారు.
వచ్చే జూన్ రెండవ తేదీ నుండి 13వ తేదీ వరకు యమునా నదికి పుష్కరాలు వస్తాయన్నారు. మన దేశంపై శత్రుదేశాలు దాడి చేసే అవకాశం లేదన్నారు. శత్రుదేశాలతో ఎలాంటి ప్రమాదము లేదని చంద్రుడు సైన్యాధిపతిగా ఉండి నివారిస్తారన్నారు. అయితే భూకంపాలు గాని వరదలు గాని వచ్చే పరిస్థితి ఉందనీ, కొన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. వచ్చే జనవరి 2027 ఫిబ్రవరి, మార్చి మాసాలలో బంగారు, వెండి మార్కెట్ ధరలు, షేర్ మార్కెట్ ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయని అప్రమత్తంగా ఉండాలన్నారు. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు.
కార్మికులు కర్షకులకు మంచి కాలం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో జూలై నుండి అక్టోబర్ మాసం వరకు ప్రతికూల పవనాలు వీచే అవకాశం ఉందని ఇబ్బందులు ఉంటాయన్నారు. కొంత రాజకీయ అనిచ్చితి ఉంటుందన్నారు. రకరకాల స్కాములు బయట పడతాయన్నారు. ప్రజలు ధార్మికమైన ప్రవర్తనతతో తమకు తాము రక్షించుకోవాలన్నారు.
కష్టాల్లో ఉన్న వారికి అవసరమైన సహకారం అందించాలన్నారు.
అనంతరం వేడుకలకు విచ్చేసిన అతిధులు, ప్రముఖులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. తదుపరి ఆహుతులైన అందరికీ ఉగాది పచ్చడి వితరణ చేశారు.
అనంతరం దేవాదాయ శాఖలో విశిష్టంగా సేవలు అందించిన 10 మంది వేద పండితులు, అర్చక స్వాములకు 10,116 రూపాయలు నగదు పురస్కారంతో పాటు, శాలువా, పండ్లు నూతన వస్త్రాలతో మంత్రి, జిల్లా కలెక్టర్, ప్రముఖులు ఘనంగా సత్కరించారు.
తదనంతరం యోగా గురువులు ముదిగొండ శాస్త్రి నేతృత్వంలో కవులు, రచయితలు చింతలపాటి మురళీకృష్ణ, మేరీకృపాబాయి, ఓలేటి ఉమా సరస్వతి, వక్కలంక రామకృష్ణ, సింహాద్రి పద్మ, బత్తిన అగస్తీశ్వర రావులతో కలిసి నిర్వహించిన కవి సమ్మేళనం అందరిని ఆకట్టుకుంది.
చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. తదుపరి కవులను, సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులను అతిధులు, ప్రముఖులు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర రావు, మచిలీపట్నం ఆర్డిఓ సాంబశివరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచే నాని, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఫణి కుమార్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ సంస్థ డైరెక్టర్ హసీం బేగ్, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం ఈవో ఆకుల కొండలరావు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మునిసిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, స్థానిక నాయకులు వెంకటస్వామి, పుల్లయ్య పలువురు దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

