MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాడతాం – సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు. వై నరసింహారావు

  • February 12, 2026
  • 0 min read
[addtoany]
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసేవరకు పోరాడతాం – సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు. వై నరసింహారావు
మచిలీపట్నం :
 
         కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారీ వర్గాలకు బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ కృష్ణా జిల్లా ఉపాధ్యా క్షులు వై నరసింహారావు పేర్కొన్నారు. అఖిల భారత సార్వత్రిక సమ్మె లో భాగంగా మచిలీపట్నం బస్టాండ్ దగ్గర నుంచి కోనేరు సెంటర్ వరకు భారీ ప్రదర్శన, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
 
        ఈ సందర్భంగా వైయన్ మాట్లాడుతూ కార్మికవర్గం నేడు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస కాలంనాటి పని పరిస్థతులను తిరిగి ప్రవేశపెట్టడానికి మన పాలకులు ఉబలాట పడుతున్నారని విమర్శించారు. 8 గంటల పనిదినం అమలుచెయ్యాలని నెల రోజులపాటు సమ్మె చేసిన చరిత్ర భారత కార్మికవర్గానికి వుందని తెలిపారు. 1926లోనే ట్రేడ్ యూనియన్ చట్టాన్ని, నిరసన తెలియజేసే హక్కు, సంఘటితపడే హక్కును సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 
 
 
       అనేక పోరాటాలు చేసి కనీస వేతనచట్టం తో పాటు 44 కార్మిక చట్టాలను సాధించుకున్నారని తెలిపారు. చరిత్రలో జరిగిన అనేక పరిణామల వలన వర్గ పోరాటాలను బలహీనపరిచే అనేక సిద్ధాంతాలు, ఆచరణలు కార్మికులను వర్గ పోరాటాలనుండి దారి మళ్ళించాయని పేర్కొన్నారు. కనీస వేతన చట్టం ఎక్కడా అమలుజరగడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్ట్ తీర్పులున్నా, ఎక్కడా అమలుకావడం లేదని విమర్శించారు. 
 
          వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం జీతం చెల్లించవలసిన తేదీ కంటే ఆలస్యమైతే వడ్డీతోసహా చెల్లించాలని ఉందని, ప్రభుత్వాలు ఆ నిబంధనను అమలు చేయడం లేదని విమర్శించారు. 4 లేబర్ కోడ్లు అమలులోకి రాకముందే ప్రయివేట్ పరిశ్రమల్లో 10 గంటల పనిదినంగా స్థిరపడిపోయిందన్నారు. పెరిగిన పని గంటలకు అదనపు వేతనం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాలలో, ప్రమాదకర పని ప్రదేశాలలో పనిచేస్తూ వేలాదిమంది కార్మికులు, ముఖ్యంగా అసంఘటిత రంగ వలస కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. 
 
          కార్మికులకు, ఇపిఎఫ్ 95 వంటి స్కీముల పేర నామమాత్ర పెన్షన్లు ఇస్తూ దేశానికి ఉత్పత్తులు అందించిన కార్మికుల పట్ల ప్రభుత్వాలు అమానవీయంగా ఉంటున్నాయని విమర్శించారు. అన్ని రంగాలలోనూ సంస్కరణలు చేసినట్లే లేబర్ సంస్కరణలు కూడా అమలు చెయ్యాలని, పెట్టుబడి వర్గాలు, బహుళజాతి కంపెనీలు ప్రభుత్వాన్ని ఎప్పటినుండో కోరుతున్నాయన్నారు. దోపిడికి గురవుతున్న కార్మిక వర్గం, రైతు కూలీలు, గిరిజనులు ఏకమై శ్రామిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. 
 
         మున్సిపల్ కార్మికులు, ముఠా కార్మికులు, ఆశా కార్యకర్తలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడి కార్యకర్తలు, బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, నాయకులు భారీ ర్యాలీ లో ఎర్రజెండాలు చేతబడి మచిలీపట్నం వీధుల వెంబడి కదం తొక్కారు.
 
         ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్యకారుల సంఘం కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంగత రమాదేవి, రైతు కూలి సంఘం నాయకులు వీరబాబు, ఆశ వర్కర్ల సంఘం నాయకురాలు కృపా జయ, మెప్మా ఆర్పీల సంఘం నాయకురాలు కె మాధవి, జీవిత బీమా ఉద్యోగుల సంఘం డివిజన్ కార్యదర్శి జి కిషోర్ కుమార్, ఆల్ ఇండియా బ్యాంకింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు వాణి, వెలుగు బుక్ కీపర్ల సంఘం నాయకురాలు రత్నకుమారి,సీఐటీయూ జిల్లా కార్యదర్శి బూర. సుబ్రహ్మణ్యం, సిపిఎం సీనియర్ నాయకులు కొడాలి శర్మ, ఐద్వా మచిలీపట్నం కార్యదర్శి కొడాలి సుజాత, సిఐటియు మచిలీపట్నం కన్వీనర్ చిరువోలు జయరావు, వికలాంగుల హక్కుల వేదిక నాయకులు నాగనబోయిన సత్యనారాయణ, సిపిఐ నాయకులు మోదమూడి రామారావు, ఏఐటియుసి నాయకులు లింగం ఫిలిప్, ఒంటి పులి లక్ష్మణరావు, ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *