MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి….జిల్లా కలెక్టర్

  • February 12, 2026
  • 0 min read
[addtoany]
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి….జిల్లా కలెక్టర్
మచిలీపట్నం :
 
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జిల్లాలోనీ ఏ దేవాలయాల్లోను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశం మందిరంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ లతో కలిసి తహసిల్దారులు, దేవాదాయ శాఖ అధికారులతో మహాశివరాత్రి ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ వీ. విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీలు జూమ్ మీటింగ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మోపిదేవి, పెదకల్లేపల్లి, ఎనమలకుదురు, కృత్తివెన్ను నాగేశ్వర స్వామి దేవస్థానం తదితర ప్రభుత్వ ప్రైవేటు దేవాలయాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు.సంబంధిత యాజమాన్యాలతోనూ దేవాదాయ శాఖ కార్యనిర్వాహక అధికారులతోనూ పోలీసు, రెవెన్యూ శాఖ సిబ్బంది సమన్వయం చేసుకొని భక్తులకు కావలసిన మంచినీరు, ఆహారము తదితర ఏర్పాట్లు సజావుగా అందేలా చూడాలన్నారు. జిల్లాలో దేవాలయాల వద్ద చిన్న ప్రదేశాలలో సామర్ధ్యానికి మించి భక్తులను లోనికి ప్రవేశించకుండా తగిన నియంత్రణ ఏర్పాటు చేయాలన్నారు.ప్రభుత్వ ప్రైవేటు అన్ని యాజమాన్యాల దేవాలయాలను సంబంధిత ఆర్డీవోలు, తహసిల్దార్లు, డిఎస్పీలు, సీఐలు ఎస్సైలు ముందుగానే ఆయా ప్రదేశాలను సందర్శించి సజావుగా పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కావలసిన ఏర్పాట్లు చూడాలన్నారు.ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నిష్క్రమనకు ఎక్కువ దారులు ఏర్పాటు చేయాలన్నారు. దర్శనానికి ఎక్కువ సమయం పట్టే పక్షంలో వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమయానికి ఆహారము, మంచినీరు అందించేలా చూడాలన్నారు.అంతేకాకుండా అంబులెన్స్లను, వైద్య శిబిరాలను ముందస్తుగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయడంతో పాటు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కోనేరు తదితర ప్రాంతాల్లో కూడా సామర్ధ్యానికి మించి భక్తులు నీటిలోకి దిగకుండా నియంత్రించాలన్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయము కలగకుండా రహదారి మార్గం సజావుగా పర్యవేక్షించాలన్నారు. వాహనాల పార్కింగ్కు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించి తగిన ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మండలాల్లో వివిధ రకాల ముఖ్యమైన ఉత్సవాలు, జాతరలు జరిగే తేదీలను సిద్ధంగా ఉంచుకొని ఆయా రోజుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ వీ.విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ దేవాలయాల వద్ద భక్తులు సురక్షితంగా ఉండేందు కోసం, శాంతిభద్రతలు పరిరక్షణ కోసం గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. 
సంబంధిత దేవాలయాల కార్యనిర్వాహణ అధికారులు దేవాలయాల వద్ద సమకూర్చవలసిన సౌకర్యాలపై పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. జనాల నియంత్రణకు ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీటీవీ ల ద్వారా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వారి సెల్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తొక్కిసలాట జరగకుండా దర్శనానికి వచ్చే భక్తుల కోసం అవసరమైతే క్యూ లైన్లు పెంచాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి దేవాదాయ శాఖ ఏసి సాంబశివరావు గుడివాడ ఆర్డిఓ జి బాలసుబ్రమణ్యం పలువురు తహసిల్దార్లు డీటీలు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *