మచిలీపట్నం:
అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని అర్పించిన త్యాగశీలి అని, ఆయన త్యాగం, పట్టుదల నేటి తరానికి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
సోమవారం పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులతో కలిసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమరావతిలో 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన ప్రత్యక్ష కార్యక్రమాన్ని వారు వీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్షతో, ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. గాంధేయవాది అయిన ఆయనలోని పట్టుదల, త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణత్యాగం చేయడంతో దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి సముచిత స్థానాన్ని కల్పించిందని అభినందించారు.
కార్యక్రమంలో డిఆర్ఓ కే చంద్రశేఖరరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మామిడి మురళి, ప్రత్యేక అధికారి నిత్యానంద్, కూటమి నాయకులు కొనకళ్ల జగన్నాథరావు(బుల్లయ్య) తదితరులు పాల్గొన్నారు.