[addtoany]
మచిలీపట్నం :
క్షయరహిత సమాజమే మన లక్ష్యం అని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి యుగంధర్ అన్నారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబి నియంత్రణకు మనమంతా సమిష్టిగా పాటుపడదామని యుగంధర్ పిలుపు నిచ్చారు. టిబి ముక్తభారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 100 రోజుల ప్రత్యేక అభియాన్ ను మార్చి 2025 నుండి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు, ఈ కార్యక్రమాన్ని విస్తరించడం జరిగిందని చెప్పారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ
దినోత్సవం సందర్భంగా వంద రోజులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యక్రమాల్ని రూపొందించిందన్నారు. టీబీ లక్షణాలు లేకపోయినా ప్రమాదంలో ఉన్న ప్రజలకు ముందస్తు స్క్రీనింగ్ , ఏఐ ఆధారిత గుర్తింపు, హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే తదితర పరికరాల వినియోగంతో టీబి కేసులను త్వరగా గుర్తించనున్నమని చెప్పారు. మొబైల్ మెడికల్ యూనిట్లు నిక్షయ వాహనాలతో గ్రామీణ ప్రాంతంలో విస్తృతంగా సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాల ద్వారా వివిధ పరీక్షలు నిర్వహించడం, నిశ్చయమిత్ర ద్వారా పోషకాహార సహాయం అందించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్ల టీబి నిర్మూలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయముగ ఉందని తెలిపారు. ప్రస్తుతం సిబి నాట్, ట్రూ నాట్ వంటి ఆధునిక పరీక్షలతో వేగంగా టీబి నిర్ధారణ జరుగుతోందన్నారు.
నిక్షయ్ పోర్టల్ ద్వారా ప్రతి రోగిని ట్రాక్ చేస్తూ నిక్షయ్ పోషణ యోజన కింద పోషకాహార సహాయం అందిస్తున్నామన్నారు. జిల్లాలో టీబీ కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయని డి ఎం హెచ్ ఓ ఆవేదన వ్యక్తం చేశారు. టీబి ముక్తభారత్ లక్ష్యంతో టీబీ నియంత్రణ చికిత్స నివారణ చర్యలపై సిబ్బందితో కలిసి అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ టి బి రోగులను వివక్షకు గురి చేయకుండా మానసికంగా వారిలో దృఢత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ టీబి నిర్మూలన లో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబి అధికారి డాక్టర్ అంబటి కాంతారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, వైద్యాధికారులు, అసిస్టెంట్ సర్జన్ గోపాలకృష్ణ, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

