మచిలీపట్నం :
వడ్డెర స్థితిగతులను, సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, డైరెక్టర్లతో కలిసి మంగళవారం మచిలీపట్నం పర్యటించారు. వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ , డైరెక్టర్లకు మచిలీపట్నం వడ్డెర సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. మూడు స్తంభాల సెంటర్ నుంచి బలరాంపేట వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీగా వడ్డెర సామాజిక ప్రజలు పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా వడ్డెరలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వడ్డెర నాయకులు మచిలీపట్నం వచ్చారు. బలరామునిపేట సెంటర్లో స్థానికులతో సమావేశం నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాతి, మట్టి పని చేసే వడ్డెరలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వీరి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పలు పథకాలను తీసుకువచ్చిందని ఈ పథకాలను లబ్ధిదారులకు అందేలా చూస్తామని నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ వడ్డెర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ లు కట్టుబడి ఉన్నారని తెలిపారు. వడ్డెరలు ఎప్పటినుంచో ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక ఉద్యమాలు చేశారని, కూటమి ప్రభుత్వం వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు. గతంలో ఆదరణ 1, 2 పథకాలను తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిందని అదేవిధంగా ఆదరణ 3 పథకంను వడ్డెర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు.
ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ డైరెక్టర్ మహాలక్ష్మి, మచిలీపట్నం వడ్డెర సంఘ నాయకులు బత్తుల దుర్గాప్రసాద్, వేముల దుర్గారావు, శివరాత్రి నాగరాజు, వేముల దుర్గాప్రసాద్, బోసు దుర్గారావు, గుంజ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.