మచిలీపట్నం:
జిల్లాలోని 61 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో 10.35 కోట్ల రూపాయల వ్యయంతో మంజూరైన మౌలిక వసతుల మరమ్మత్తు పనులు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి చాంబర్లో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల మరమ్మత్తు పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనీ 61 ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ప్రహరీ, దోమల వలలు, పైకప్పు, తలుపులు, విద్యుత్తు, మంచినీరు, రంగులు తదితర మరమ్మత్తు పనులు చేపట్టుటకు 10.35 కోట్ల రూపాయలను జిల్లా ఖనిజాల నిధులు (డి ఎం ఎఫ్), ప్రభుత్వ నిధులు నుండి మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఇందులో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల మేరకు ఖర్చు చేసి 46 వసతి గృహాల్లో పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులు కూడా వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.
వసతి గృహాల్లో ఎట్టి పరిస్థితిలోనూ మంచినీరు కలుషితం కారాదని, ఆహారంలో నాణ్యత విధిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతి గృహాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు విధిగా చేపట్టాలన్నారు. ఏ విద్యార్థికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన వెంటనే స్పందించి తగిన ఆరోగ్య చికిత్సలు చేయించాలన్నారు. వసతి గృహాలకు ఎలాంటి వంటగ్యాస్ కొరత రాకుండా చూడాలని ఆదేశించారు
ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి షాహిద్ బాబు, బీసీ సంక్షేమ సాధికారతాధికారి రమేష్, డిటిడబ్ల్యుఓ ఫణి ధూర్జటి, డీఎస్ఓ మోహన్ బాబు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్త మురళి, ఏపీఈడబ్ల్యుఐడీసీ ఈఈ రాయన్న పలువురు ఏఎస్డబ్ల్యూఓ లు పాల్గొన్నారు.