మచిలీపట్నం:
జిల్లాలో గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ నగరంలోని మీకోసం సమావేశ మందిరంలో గృహ నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి మండలాలు, పురపాలికల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత 20 రోజులుగా గృహ నిర్మాణ పనులు పురోగతి పరిశీలిస్తే 844 గృహాలు దశల వారి మార్పు జరిగాయని, అందులో 306 గృహాలు పైకప్పు స్థాయి నుండి రూఫ్ క్యాస్ట్ స్థాయికి చేరుకున్నాయన్నారు. ఆ ప్రకారం 16,515 ఇళ్లకు గాను ఇంకను 16,209 ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు.
గృహ నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత ప్రమాణాలు విధిగా పాటించాలన్నారు. దశలవారీగా పనులు పూర్తయిన తర్వాతనే సంబంధిత గృహ నిర్మాణాల బిల్లులు లబ్ధిదారులకు చెల్లించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు కాకుండానే ముందుగా చెల్లించరాదని స్పష్టం చేశారు.
ఎవరికైనా చెల్లింపులు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి వెంకటరావు, ప్రత్యేక అధికారులు జెడ్పి డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, మత్స్యశాఖ జేడీ అయ్యా నాగరాజా, ఐసిడిఎస్ పి డి ఎం ఎన్ రాణి, ఆర్ అండ్ బి ఈఈ లోకేష్, సమగ్ర శిక్ష ఏపిసి కుమిదిని సింగ్, టిడ్కో పీవో చిన్నోడు, మచిలీపట్నం, గుడివాడ, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు బాపిరాజు, మనోహర్,నజీర్, గృహ నిర్మాణ సంస్థ ఈఈలు బుచ్చిబాబు, శివప్రసాద్ పలువురు ఎంపీడీవోలు, డిఈఈలు, ఏ ఈ లు పాల్గొన్నారు.