మచిలీపట్నం:
సోమవారం నిర్వహించిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి, కావూరి సాంబశివరావుకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.
కావూరి 1984, 89, 98, లలో మూడుసార్లు మచిలీపట్నం నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారని, తదుపరి ఏలూరు నుండి రెండు విడతలుగా ఎంపీగా సేవలందించి, కేంద్ర మంత్రిగా పనిచేశారని పలువురు కౌన్సిల్ సభ్యులు గుర్తు చేసుకున్నారు. నిరంతరం ప్రజా సేవలో తరించారని కొనియాడారు.
తొలుత మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ నియోజకవర్గ పార్లమెంటు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఎంపీ అంటే కేవలం ముఖ్యమైన నాయకులకు మాత్రమే అందుబాటులో ఉండడం కాకుండా గ్రామ గ్రామాన ప్రజలను స్వయంగా కలిసి వారి సాధకబాధకాలు తెలుసుకున్నారన్నారు. మొట్ట మొదటిగా ఈ సాంప్రదాయం ఆయనతోనే ప్రారంభమైందన్నారు. 40 సంవత్సరాల క్రితం టీవీ అనేది కేవలం డబ్బున్న వారి ఇంటికే పరిమితమైన రోజుల్లో, మారుమూల పల్లెటూళ్లలో పంచాయతీ ఆఫీసుల్లో, దేవాలయాల్లో, ప్రజలు అందరూ కూర్చుని టీవీ ద్వారా వీక్షిస్తూ రాష్ట్రంలో జరిగే అన్ని పరిణామాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి ప్రజా సేవకులు కావూరి సాంబశివరావు అని కొనియాడారు.
కార్పొరేటర్ సుబ్బన్న మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ అనే పథకం ద్వారా టైలరింగ్, హెవీ డ్రైవింగ్, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, డిజిటల్ మెకానిక్ కోర్సులు ఉచితంగా ట్రైనింగ్ క్లాస్ లు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సర్టిఫికెట్లు ఇప్పించిన ఘనత కావూరికే దక్కుతుందన్నారు.
కావూరి అందించిన సేవలను పలువురు కార్పొరేటర్లు కొనియాడారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు యావన్మంది కావూరు సాంబశివరావు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తదుపరి 10 నిమిషాలు కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేశారు.