కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోస్టల్ శాఖ మరో ప్రజాహిత కార్యక్రమంతో ముందుకొచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో, కేవలం రూ. 5,698 ప్రీమియంతో ఒక కుటుంబంలోని నలుగురికి వర్తించే రూ. 20 లక్షల ఆరోగ్య భీమా పాలసీని బుధవారం పోస్టల్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, రిలయన్స్ సౌజన్యంతో తీసుకువచ్చిన ఈ నూతన పాలసీ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా పాలసీ తీసుకున్న వారికి ఒక సంవత్సరం పాటు ఈ ఆరోగ్య భీమా వర్తిస్తుందని ఆయన వివరించారు. తక్కువ ప్రీమియంతో భారీ కవరేజ్ కల్పించడం ఈ పాలసీ ప్రత్యేకతగా నిలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రులలో పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ఈ పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది ప్రజలకు పాలసీ వివరాలను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోస్టల్ శాఖ పిలుపునిచ్చింది.
పోస్టల్ సేవలను వినియోగించుకోండి ఆరోగ్య భద్రతను సొంతం చేసుకోండి అని అధికారులు ప్రజలకు సందేశమిచ్చారు.