మచిలీపట్నం:
జిల్లా పరిధిలోని జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు సక్రమంగా పనిచేయకపోతే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించిన అజెండా అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై పలుచోట్ల విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల అధికారులు, ఆయా కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిధులున్నా నిర్వహణ సరిగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైన చోట్ల తక్షణం మరమ్మతులు చేపట్టి నిరంతరాయంగా వెలిగేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ఈ సమస్యపై దృష్టి పెట్టకపోతే సంబంధిత అధికారులపై చర్యల కోసం ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని అన్నారు. రహదారి ప్రమాదాలను అరికట్టటం ప్రతి ఒక్క అధికారి బాధ్యత అని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతీయ రహదారులకు చేరుకునే అప్రోచ్ రహదారులకు అత్యవసరంగా స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు వెలగని ప్రాంతాలలో రహదారి ప్రమాదం జరిగితే జాతీయ రహదారుల అధికారులు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ, గత సమావేశంలో పనిచేయని విద్యుత్ దీపాల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులతో పాటు కాంట్రాక్టర్కు షోకాస్ నోటీసు జారీ చేయాలని ఎస్పీ తమ సిబ్బందిని ఆదేశించారు.
సమావేశంలో సిఎస్ఓ కె ధర్మేంద్ర, జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ పిడి విద్యాసాగర్, జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, ఇంచార్జ్ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రాష్ట్ర రహదారులు, పోలీసు, రెవిన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.