బ్యాంకింగ్, బీమా లాంటి ఆర్ధిక సంస్థల్లో అధిక వేతనాలు లభిస్తాయని, విద్యార్ధులు ఆ దిశగా ఆలోచన చేయాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె రాంజీ సూచించారు. సోమవారం విశ్వవిద్యాలయ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యములో బజాజ్ ఫిన్సర్వ్ వారిచే బ్యాంకింగ్, బీమా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశం కు యువత పెద్ద సంపద అని, వారిలో నైపుణ్యం జోడిస్తే ప్రపంచం లో ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధ్యమవుతుందన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద గతంలో మౌలిక వసతులు కల్పనకు ప్రాధాన్యత ఇచ్చేవని, ఇప్పుడు యువతలో నైపుణ్యం పెంచడానికి నిధులు వెచ్చించడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.
రెక్టర్ ఆచార్య ఎంవి. బసవేశ్వరరావు మాట్లాడుతూ 2009 సంవత్సరం నుండే కృష్ణా విశ్వవిద్యాలయం లో నైపుణ్యం పెంచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎన్. ఉష మాట్లాడుతూ ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ లో ఇతర విభాగాల విద్యార్ధులను కూడా భాగస్వాములను చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.
మేనేజ్మెంట్ విభాగం అధిపతి డా ఎం. శ్రావణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బజాజ్ ఫిన్సర్వ్ ప్రతినిధులు రాజశేఖర్, పవన్ కుమార్ లు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ గురించి వివరించారు. ఈ కార్యక్రమం లో మేనేజ్మెంట్ విభాగం సహ ఆచార్యులు డా. పద్మజ, సహాయ ఆచార్యులు డా. భువనేశ్వరి, డా. జగదీష్, విద్యార్ధులు పాల్గొన్నారు.