మచిలీపట్నం :
సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో ప్రతి విద్యార్థిని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు అన్నారు.
ఈ సందర్భంగా మచిలీపట్నంలోని హిందూ కళాశాల ప్రాంగణం లోగల ఎస్ వి పబ్లిక్ స్కూల్ నందు గురువారం మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ , పోలీసు అధికారులు పాల్గొని విద్యార్థినిలకు మహిళా రక్షణ చట్టాలు, బాల్యవివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలి, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై విపులంగా అవగాహన కల్పించారు.
ప్రత్యేకంగా సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్లకు స్పందించవద్దని సూచించారు. అలాగే ఆత్మరక్షణకు సంబంధించిన ప్రాథమిక సెల్ఫ్ డిఫెన్స్ పద్ధతులను నేర్చుకోవడం ద్వారా విద్యార్థినిలు తమ భద్రతను మరింత మెరుగుపరుచుకోవచ్చని వివరించారు.
ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని, మహిళా హెల్ప్లైన్ నంబర్లు 181, 112లను వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినిలలో చట్టపరమైన అవగాహన పెరిగిందని, తమ భద్రత పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలనే భావన ఏర్పడిందని కళాశాల యాజమాన్యం తెలిపారు.