మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలి — జిల్లా కలెక్టర్
SSN
- February 3, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
మానవ తప్పిదాలతో జరిగే రహదారి ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి రోడ్డు ప్రమాదాల స్థితిగతులు, జాతీయ, రాష్ట్ర రహదారులపై బ్లాక్ స్పాట్లకు తీసుకున్న చర్యలు, డ్రంక్ అండ్ డ్రైవ్, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ కేసులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. రహదారులపై గుర్తించిన బ్లాక్ స్పాట్ల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ప్రమాదాలకు అవకాశం లేకుండా తక్షణం స్పందించి పరిష్కరించాలన్నారు.
జాతీయ రహదారులపై విద్యుత్ దీపాలు పనిచేయకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ సమస్యపై ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారుల తీరు మారడం లేదని, ఈసారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెలుగుతున్నవి, వెలగని విద్యుత్ దీపాల వివరాలను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు.
విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉన్న కాలినడక వంతెనలకు (ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్) రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలను కడుతున్నారని, దీనివల్ల అవి నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు ఆవాసాలుగా మారుతాయని, వాటి తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారులపై ప్రమాదం సంభవించినప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు పనిచేయకపోతే కనుక, సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో చేరుస్తామని హెచ్చరించారు. అదేవిధంగా గ్రామాల నుంచి జాతీయ రహదారులకు కలిసే ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, అటువంటి ప్రాంతాలను గుర్తించి అప్రోచ్ రహదారులకు స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
2025 డిసెంబర్ నెలలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో మొత్తం 52 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, వాటిలో 32 మరణాలు, 31 మంది గాయాలపాలయ్యారని అధికారులు ఈ సందర్భంగా వివరించారు.
సమావేశంలో జిల్లా రవాణా అధికారి ఎన్ యు ఎన్ ఎస్ శ్రీనివాస్, భారత జాతీయ రహదారుల అధికార సంస్థ పిడి విద్యాసాగర్, జిల్లా ప్రజారవాణా అధికారి వెంకటేశ్వర్లు, రహదారులు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లోకేశ్వరరావు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్ కుముదిని సింగ్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ యుగంధర్, రాష్ట్ర రహదారులు, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

