పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో శబ్ద నియంత్రణకు పోలీసులు సూచనలు చేశారు. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి సారించేలా అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని జిల్లా పోలీస్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రార్థనా స్థలాల వద్ద(దేవాలయాలు, మసీదులు ,చర్చిలు) వద్ద పరిమితికి మించి శబ్దాలు చేస్తూ మైకుల వినియోగం చేయవద్దని, విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించే విధంగా శబ్ద కాలుష్యానికి పాల్పడకూడదని అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ‘సైలెన్స్ అవర్స్’గా పరిగణించి, పరీక్షలు పూర్తయ్యే వరకు మైకులు, లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించి ప్రార్థనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి నట్లయితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ ప్రజలను కోరింది.