మచిలీపట్నం:
ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం మాఘ పౌర్ణిమ సందర్భంగా జిల్లాలో మంగినపూడి బీచ్, హంసలదీవి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పహారాతోపాటు అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఈ మేరకు పలువురు అధికారులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మాఘ పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని మంగినపూడి బీచ్, హంసలదీవి వద్ద పుణ్యస్నానాలు ఆచరించుటకు భక్తులు విరివిగా వస్తుంటారని, ఎవరు కూడా ప్రమాదానికి గురికాకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా రక్షించేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.
సముద్ర తీరం వద్ద ఎలాంటి చెత్తాచెదారాలు లేకుండా ఎప్పటికప్పుడు పారిశుధ్యం ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
వైద్య ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకుని ఎవరికైనా అనారోగ్యం అయితే వెంటనే ప్రధమ చికిత్స చేయాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.
మహిళలకు ప్రత్యేకించి దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదులను ఏర్పాటు చేయాలన్నారు.
కంట్రోల్ విభాగాలను 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసి మైకు ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్త జాగ్రత్తలు భక్తులు పాటించేలా తెలియజేయాలన్నారు.
అలాగే అగ్నిమాపక యంత్రాలను, నిరంతర విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆహారం కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.
రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ సౌకర్యాలను పర్యవేక్షించాలన్నారు.