జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు మండలం, పెడన నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల సందర్శన
SSN
- January 28, 2026
- 0 min read
[addtoany]
మచిలీపట్నం:
క్రమశిక్షణ, శ్రద్ధతో బాగా చదువుకొని పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు ఉద్బోధించారు.
బుధవారం జిల్లా కలెక్టర్ గుడివాడ నియోజక వర్గం గుడ్లవల్లేరు మండలం, పెడన నియోజకవర్గ కేంద్రంలో పర్యటించి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సమాయత్తం చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రతిభ పాటవాలను పరీక్షించారు.
తొలుత జిల్లా కలెక్టర్ గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఇక పదవ తరగతి పరీక్షలకు 46 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అలోగా క్రమశిక్షణ,శ్రద్ధతో చదివితే పరీక్షల్లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చన్నారు .
ఏ సబ్జెక్టు బాగా నేర్చుకోగలిగాము, ఏ సబ్జెక్టు ఇంకా బాగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నదో విద్యార్థులు వారికి వారే అంచనా వేసుకోవాలన్నారు.
తెల్లవారుజాముననే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆ సమయంలో కొన్ని గంటలు కేటాయించి శ్రద్ధగా చదువుకునే అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు
మిగిలిన సమయాల్లో వివిధ రకాల ఆలోచనలతో సరిగా చదువుకునే పరిస్థితి ఉండదన్నారు.
పదవ తరగతిలో క్రమశిక్షణతో సీరియస్ గా చదివే అలవాటు చేసుకుంటే అది జీవితాంతం ఉంటుందని తద్వారా ఉన్నత ఏరంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం లభిస్తుందన్నారు.
రానున్న ఒకటిన్నర నెల రోజులు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, పరీక్షలలో మంచి ఫలితాలు సాధించాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు.
తదుపరి పెడన మున్సిపల్ పరిధిలోనీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించి ఉపాధ్యాయులుగా మారి కూడికలు, తీసివేతలు ఎంతమేరకు చేయగలుగుతున్నారో స్వయంగా పరీక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఎలా బోధించాలి అనే విషయాలపై ఉపాధ్యాయులకు విశదీకరించారు.
వడ్లమన్నాడు ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలును పరిశీలించి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఫౌండేషనల్ లీటరసి న్యూమరసి(ఎఫ్ ఎల్ ఎన్) కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ఇందుకోసం ప్రాథమిక పాఠశాలలో న్యూమరసి బేసిక్స్ ఎంతవరకు అమలు అవుతుందో పరిశీలించడం జరుగుతుందన్నారు.
అలాగే ఉన్నత పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలను బాగా వ్రాసేందుకు వీలుగా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు.
ఇందులో ఇప్పటికే 54 రోజులు గడిచిపోయాయన్నారు. ఇప్పటివరకు విద్యార్థులు ఏమాత్రం సబ్జెక్టులు నేర్చుకున్నారో పరీక్షలు ఏ విధంగా తయారవుతున్నారు గమనించేందుకు పాఠశాలలను సందర్శిస్తున్నామన్నారు.
ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించామని వారు ఏ విద్యార్థికి ఏ సబ్జెక్టులో సహాయం కావాలో తెలుసుకుని ఆ సహాయం అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. అంతే కాకుండా ప్రతి విద్యార్థికి ఉపయోగపడే విధంగా ప్రత్యేకించి స్టడీ మెటీరియల్ అన్ని పాఠశాలలకు అందజేశామన్నారు. క్రమం తప్పకుండా స్లిప్ టెస్టులను నిర్వహిస్తున్నామని, నూటికి నూరు శాతం విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని సాధించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డి ఈ ఓ సుబ్బారావు, స్థానిక ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. .

