మచిలీపట్నం:
ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వ సెక్రెటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ షెడ్యూల్ కులముల సేవ సహకార సంఘ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ కోరారు.
బుధవారం సాయంత్రం ఆయన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో భూమి కొనుగోలు పథకం లబ్ధిదారులు, నేషనల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ ఎఫ్ డి సి), నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ ఎస్ కేఎఫ్డిసి) పథకాల లబ్ధిదారులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వడ్డీ మాఫీ సద్వినియోగంపై అవగాహన కల్పించారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ 2015–16 నుండి 2018–19 మధ్య కాలంలో ఎన్ ఎస్ ఎఫ్ డి సి, ఎన్ ఎస్ కేఎఫ్డిసి పథకాల ద్వారా రుణాలు పొందిన నిరుపేద ఎస్సీ లబ్ధిదారులు, 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 30వ తేదీ వరకు రుణం మొత్తం చెల్లించిన వారికి వడ్డీ మాఫీ చేయబడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తీసుకున్న రుణానికి వడ్డీ కాకుండా అసలు మాత్రమే చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించిందని, ఇది ఎంతో లబ్ధి చేకూరుతుందని, సద్వినియం చేసుకోవాలన్నారు. దీనివల్ల సిబిల్ స్కోర్ కూడా మెరుగవుతుందని, భవిష్యత్తులో రుణాలు పొందడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన మగినం స్వతంత్రరావు 2018–19 కాలానికి సంబంధించిన ట్రాక్టర్ రుణం రూ.2.50 లక్షలు వన్ టైం సెటిల్మెంట్ ద్వారా కార్పొరేషన్ కార్యాలయంలో చెల్లించగా లబ్ధిదారున్ని వారు ప్రత్యేకంగా అభినందించారు.
సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రమేష్, సోషల్ వెల్ఫేర్ డిడి సాహిత్ బాబు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, ఎస్సీ కార్పొరేషన్ ఈవో సెల్వి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.