మచిలీపట్నం:
జిల్లాలోని రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి జయలక్ష్మితో కలిసి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో భూ సమస్యలకు సంబంధించిన పిజిఆర్ఎస్ అర్జీల పురోగతి, మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, సుమో మోటో కుల ధృవీకరణ పరిశీలన తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ల ద్వారా అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వాటిపై సంబంధిత తహసిల్దార్లు, వీఆర్వోలతో సమీక్షించాలన్నారు. రీ సర్వేకు సంబంధించి గుడివాడ, మచిలీపట్నం డివిజన్ లో జాయింట్ ఎల్పీఎంలు అత్యధికంగా ఉన్నాయని, వాటి సంఖ్య తగ్గింపుకు కృషి చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్వో కే చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డీపీఎమ్ డీసీ నారాయణ, బందరు, గుడివాడ, ఉయ్యూరు ఆర్డీవోలు పోతురాజు, జి బాలసుబ్రమణ్యం, బిఎస్ హేలా షారోన్, సర్వే ఏడి లక్ష్మణరావు, కలెక్టరేట్ ఏవో రాధిక, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా సమన్వయకర్త రవికాంత్, ల్యాండ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.