మచిలీపట్నం:
జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్యాధికారులతో సమావేశమై ప్రసూతి మరణాలపై సమీక్షించారు. ఈ క్రమంలో ఆయన జిల్లాకు సంబంధించిన రెండు ప్రసూతి మరణాల కేసులను విచారించి, వారి మరణానికి గల కారణాలను వారికి చికిత్స చేసిన వైద్యులను, ఘటనా వివరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య, సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ మాతృత్వ మరణాల నివారణకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణనష్టం జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిష్కరించలేని సమస్య తలెత్తినప్పుడు వెంటనే వారికి తెలియజేయాలని, తద్వారా సమయం వృధా కాకుండా మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు వారి పరిధిలోని గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితులపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని, వారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్నప్పటికీ సమయానికి అవసరమైన వైద్య పరీక్షలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడుతున్నది లేనిది ఆరా తీయాలన్నారు. వారు తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రత్యేక జీవనశైలి విధానంపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గర్భిణీ స్త్రీల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా వారిని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ యుగంధర్, డిసిహెచ్ఎస్ డాక్టర్ శేషు, ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, జిజిహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కారెడ్ల సుశీల, పలువురు వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.