ప్రథమ బహుమతి పొందిన చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
మచిలీపట్నం :
77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సోమవారం మచిలీపట్నం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో జరిగిన వేడుకల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశభక్తి ప్రభోదాత్మక గీతాలకు నర్తించి ప్రతి పౌరునిలో దేశభక్తి భావాన్ని రగిలించి, దేశ సమగ్రతను చాటి చెప్పారు.
కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ బాలికల ఉన్నత పాఠశాల (రుస్తుంబాద) విద్యార్థులు వందేమాతరం.. పాటకు, శ్రీ చైతన్య ఉన్నత పాఠశాల విద్యార్థులు సెల్యూట్ ది సోల్జర్.., ఎస్వీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి ప్రభోదాత్మక భారతీయ నృత్యం.., సెయింట్ జాన్స్ హై స్కూల్ విద్యార్థులు దేశమంటే మట్టి కాదోయ్.., నిర్మల హై స్కూల్ విద్యార్థులు ఇండియా వాలే.., శ్రీ బాలాజీ విద్యాలయం పాఠశాల విద్యార్థులు సునో గౌర్ సే దునియా వాలో.., చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆయేరే తుఫాన్ వంటి దేశభక్తి గేయాలకు నర్తించి ఆహుతులను అలరించారు.
సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి పొందగా, ఎస్వీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల ద్వితీయ, సెయింట్ జాన్స్ హై స్కూల్ తృతీయ బహుమతులను పొందాయి. వారికి జిల్లా కలెక్టర్ డి కె బాలాజి, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. ప్రదర్శనలో పాల్గొన్న మిగిలిన పాఠశాలలకు ప్రోత్సాహక బహుమతులను అందించారు.
అదేవిధంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ విద్యాలయం పాఠశాల విద్యార్థులు.. లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ కల్పించే పోక్సో చట్టంపై అవగాహన, అదేవిధంగా యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ మచిలీపట్నం ఆర్.సి.యం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన లఘునాటికలు ఆలోచింపచేశాయి.