దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మచిలీపట్నంలోని కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ హాజరై వేడుకలకు విశిష్టతను చేకూర్చారు. కార్యక్రమ ప్రారంభంలో నెట్టెం రఘురామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, హాజరైన అధికారులు, సిబ్బంది సమూహంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం గౌరవ వందనం ను చేశారు. జాతీయ జెండా రెపరెపలాడుతుండగా ప్రాంగణమంతా దేశభక్తి నినాదాలతో మార్మోగింది.
ఈ సందర్భంగా జరిగిన సభలో నెట్టెం రఘురామ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్య విలువలు, పౌర హక్కులు బాధ్యతల ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.దేశ స్వాతంత్ర్యం, జాతీయ సమగ్రత కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. యువత దేశ భవిష్యత్తు అని, క్రమశిక్షణ, కఠిన శ్రమ, దేశభక్తి, సేవాభావం కలిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. బ్యాంకింగ్ రంగం దేశ ఆర్థికాభివృద్ధికి పునాది అని, కేడీసీసీ బ్యాంక్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తూ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసమే బ్యాంక్ బలమని, పారదర్శకత, సేవాభావం, బాధ్యతాయుత విధానాలతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో శ్యామ్ మనోహర్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ అలాగే కేడీసీసీ బ్యాంక్ ఉద్యోగులు కూడా హాజరై కార్యక్రమ విజయవంతానికి తమ వంతు సహకారం అందించారు.