జనవరి 25వ తేదీన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి భారతదేశ పౌరులమైన మేము, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో.. అంటూ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న దేశవ్యాప్తంగా నిర్వహించ బడుతుందన్నారు. ఓటరు నమోదు, ముఖ్యంగా యువతను ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశం అని, “నా భారత్, నా ఓటు” (మై ఇండియా, మై ఓట్) అనే నేపథ్యంతో, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలలో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలనే స్పృహను ఇది కలిగిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
జనవరి 25వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ముందుగానే నేడు ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేయించినట్లు డిఆర్ఓ కే చంద్రశేఖరరావు ఈ సందర్భంగా వివరించారు.
ప్రతిజ్ఞ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ జీ బాలసుబ్రహ్మణ్యం, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాధిక తదితర ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.