మచిలీపట్నం:
జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు.
మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశాల మేరకు డిఆర్ఓ నగరంలోని తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు మూడు దశల్లో జరుగుతాయన్నారు.
మొదటి దశలో నీతి, మానవ విలువల పై పరీక్ష మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 21వ తేదీన 128 జూనియర్ కళాశాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందన్నారు.
ఇంటర్మీడియట్ వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల 27వ తేదీ నుండి వచ్చే ఫిబ్రవరి నెల 10వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, ఇంకొక సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలన్నారు.
జిల్లాలో సాధారణ ప్రాక్టికల్ పరీక్షల కోసం 84 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, వృత్తివిద్య ప్రాక్టికల్ పరీక్షల కోసం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
జిల్లాలో సాధారణంగా వృక్ష ,జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల పరీక్షలకు సంబంధించి మొత్తం 27,161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు.
వృత్తి విద్య ప్రాక్టికల్ పరీక్షలకు మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులు 1,868 మంది పరీక్షలకు కానున్నారన్నారు.
ఇంటర్మీడియట్ థియరీ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి నెల 23వ తేదీ నుండి మార్చి నెల 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు.ఈ థియరీ పరీక్షలు జిల్లాలోని 63 కేంద్రాలలో జరుగుతాయన్నారు.
ఈ పరీక్షలకు మొదటి రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 49,579 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కంట్రోల్ విభాగాన్ని మచిలీపట్నంలోని నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని పరీక్షలు సంపూర్ణ పర్యవేక్షణ చేయాలన్నారు.
సిట్టింగు, ఫ్లయింగ్ స్క్వేర్లు అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు పర్యవేక్షించాలన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్తు, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 163 భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ ను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వివి నాయుడు, పరీక్షల కన్వీనర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సరళ కుమారి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.