రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఆదివారం మంత్రి రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలని ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశామన్నారు.
గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. అణా పైసలతో సహా నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటకు ధర చెల్లించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల విధులను ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నామన్నారు. కొన్న ప్రతి బస్తాకు 24 గంటల్లో అవసరమైతే 4 నుంచి 5 గంటల్లో కూడా చెల్లింపు చేసిన దాఖలాలు ఉన్నాయన్నారు. ధాన్యం డబ్బులు రైతుకు చెల్లించాలనే చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
తాను పేదరికం నుంచి వచ్చానని తనకు రైతుల బాధలు తెలుసన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదన్నది ప్రధాన ఉద్దేశం అని ప్రతి రైతుకు మేలు జరగాలన్నదే తమ అభిమతం అన్నారు. రైతులకు మిల్లర్లు గాని, బ్రోకర్లు గాని ఎవరు అన్యాయం చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రభుత్వ అధికారులు పనితీరు, ప్రవర్తన పట్ల ప్రజల అభిప్రాయాలను పైనుండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి సేకరిస్తున్నారన్నారు.
దీంతో మిల్లర్లు గాని, అధికారులు గానీ ఎవరు కూడా రైతుకు అన్యాయం చేయాలంటే వెనుకంజ వేస్తారన్నారు.