MachilipatnamLocal News
February 12, 2026
కృష్ణా జిల్లా

గుంతలు లేని రోడ్లు ప్రభుత్వ సంకల్పం

  • December 23, 2025
  • 1 min read
[addtoany]
గుంతలు లేని రోడ్లు ప్రభుత్వ సంకల్పం
మచిలీపట్నం:
 
– నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికీ రోడ్డు వేయిస్తా
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటాం
– అమరావతి నుండి హైదరాబాద్ అనుసంధానానికి ప్రతిపాదనలున్నాయి
– మచిలీపట్నంలో రోడ్డు అభివృద్ధికి భూమి పూజ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర
 
     నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతానికి మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించి తీరుతానని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని మూడు స్తంభాల నేషనల్ హైవే 65లో భాగంగా ఉన్న మూడు స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటర్ వరకు ఉన్న 1.20 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ.1.38 కోట్ల వ్యయంతో 10 మీటర్ల వెడల్పులో రోడ్డును విస్తరించబోతున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి నివేదికను సిద్ధం చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో ప్యాచ్ వర్కులతో గుంతలు లేని రోడ్లు చేసి చూపించాం. తర్వాత రూ.8.90 కోట్లతో పలు రోడ్లను అభివృద్ధి చేశాం. మరో రూ.37 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆర్ అండ్ బీ మంత్రి నుండి ఆమోదం లభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.50 కోట్ల విలువైన రోడ్డు పనుల్ని నియోజకవర్గంలో చేశాం.
 
       త్వరలోనే చిన్నాపురం నుండి కమ్మవారి చెరువు రోడ్డు, తాళ్లపాలెం రోడ్డు పనుల్ని కూడా పూర్తి చేస్తాం. మరో రూ.69 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం. ఆ నిధులు కూడా వస్తే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి రోడ్డు సదుపాయం కల్పించుకుంటాం. విజయవాడ రోడ్డు విస్తరణకు ప్రజలు కూడా మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. అత్యంత సుందరంగా రోడ్డును నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. మురుగు నీటి వ్యవస్థను మెరుగు పర్చేందుకు రూ.13 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. హ్యామ్, అమృత్ 2.0 వంటి పథకాలతో చేయాల్సిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేస్తాం. తాగునీరు, డ్రైనేజీలు, పారిశుధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నాం. పంచాయతీ రాజ్ శాఖ నుండి రూ.20 కోట్లు కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గ్రామాల్లోని డ్రైనేజీని అభివృద్ధి చేస్తాం. 
 
        మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేసుకుంటున్న నేపథ్యంలో.. రోడ్ల నిర్మాణం కూడా అత్యంత కీలకంగా మారబోతోంది. నాబార్డు నిధులతో అమరావతి-మచిలీపట్నం మధ్య గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అభివృద్ధి చేయబోతున్నాం. ఇప్పటికే విజయవాడకు ఆరులైన్ల రోడ్డు మార్గం ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం నుండి 12 వరుసల విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. అదే సమయంలో మచిలీపట్నం-రేపల్లె-నడికుడి మీదుగా తెలంగాణకు రైలు మార్గం అభివృద్ధికి ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కూడా సిద్ధంగా ఉంది. త్వరలోనే రైల్వే, నేషనల్ హైవే సంస్థలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *